
కర్నూలు టౌన్ (ఈటీవీ): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించి పండుగను నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభావం వినాయక చవితి ఉత్సవాలపై పడుతుందని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ‘‘ప్రతి ఏడాది కర్నూలు నగరంలోని ఘాట్ వద్ద వినాయక నిమజ్జనాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది నీరు లేకపోవడంతో నిమజ్జనానికి అవకాశం లేదని, మండపాల్లో రెండు అడుగుల్లోపు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, ఆ స్థలంలో నిమజ్జనం చేసుకునేలా ఉత్సవాలను నిర్వహించుకోవాలి’’ అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే పెద్ద విగ్రహాలను కొనుగోలు చేసినట్లయితే.. వాటిని భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ శైలేశ్వర్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజన్బాబు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply