
విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ‘విశ్వంభర’ కోసం చిరంజీవి అభిమానులు, సినీ ప్రేమికులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమా విడుదలకు మరో అడుగు ముందుకు పడినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో వ్యాపార ఒప్పందం పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసి, అధికారికంగా ప్రకటించడంపై చిత్రబృందం దృష్టిపెట్టింది. చిరంజీవి కథానాయకుడిగా, వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యమున్న ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ, నిర్మాణానంతర పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. దాంతో విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడింది. ఇటీవలే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేయడంతో విడుదలకు దారులు తెరుచుకున్నట్టైంది.
విజయాభినందన

‘ఇరుముడి’ చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయనతోపాటు రామ్చరణ్ కూడా ఈ బృందానికి అభినందనలు తెలిపారు.రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ తదితరులు చిరంజీవితో సమావేశమయ్యారు.











Leave a Reply